‘దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి’.. భోజ్శాలలో ఎస్పీ వార్నింగ్ వైరల్
- భోజ్శాల హిందువులదేనని ఇటీవల హైకోర్టు తీర్పు
- అంతకుముందు శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేలా అనుమతి
- సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ముస్లింలు
- అప్పటి వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి
- ఈ క్రమంలో ఎస్పీ వార్నింగ్
మధ్యప్రదేశ్లోని భోజ్శాల వివాదాస్పద కట్టడం కేవలం హిందూ దేవాలయమేనని మే 15న రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు అక్కడ ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఉండేది. అయితే కోర్టు తీర్పు తర్వాత వస్తున్న మొదటి శుక్రవారం కావడంతో అక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో ధార్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సచిన్ శర్మకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన జీపుపై నిలబడి అల్లరి మూకలను గట్టిగా హెచ్చరించారు. ‘‘ఎవరికైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనే ధైర్యం ఉంటే, రేపు (శుక్రవారం) ప్రయత్నించి చూడండి. మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. ఎవరినీ వదిలిపెట్టం’’ అంటూ ఎస్పీ సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
గతంలో 2003 నుంచి ఇక్కడ మంగళవారం హిందువులు పూజలు, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతినిచ్చింది. దీనిపై హిందూ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో.. హైకోర్టు ఆ పాత ఉత్తర్వులను కొట్టేసింది. ఇది సరస్వతీ దేవి ఆలయమని తీర్పునిచ్చింది. ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వేరే చోట స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.